8. మార్గము-సత్యము-జీవము

8. మార్గము-సత్యము-జీవము

 యేసు యీలాగు చెప్పెను ''నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప యెవరును తండ్రి యొద్దకు రాడు'' (యోహాను 14:6). మార్గమును బోధించుటకు తన జననమును, మరణమును, పునరుత్ధానమును మనకు సాదృశ్యముగా చూపించుచు మనలను కూడా అట్లే జీవించుమని తెలిపెను.  తన ప్రతి అంశముతోను మనలను ఐక్యత పరచు కొనుమని ప్రకటించెను. మరియు అపొస్తలుల ద్వారా ప్రవచింపజేసెను. '' నేను చేసిన ప్రకారము మీరును చేయ వలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని'' (యోహాను 13:15) అని చెప్పబడును కను క్రీస్తు మార్గమే మనలను క్రీస్తుగా మార్చి, ఆయన వలె క్రీస్తు యేసు నందు ఉంచును.''కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళవాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను, బలిగాను అర్పించు కొనెను.  ఆలాగుననే మీరును నడచుకొనుడి'' (ఎఫెసి 5:1,2). పరిమళ వాసన యనగా దివ్యానుభూతి. ప్రేమ యనగా దైవమే. దైవము అనుభవములో ఆనంద స్వరూపుడు. ఆయన అంశయైన యేసు కూడా  ఆనంద స్వరూపుడే. అయినను మనకు మార్గముగా ఉండుట కొరకు మన వలె శరీరధారి యైనందున  ఆయనకు శారీరక బాధలు శరీర ధర్మముగా సంక్రమించెను. అందు వలన ఆయన త్యాగమునకు గుర్తు. బాధలను అనుభవించుట ఆయనకు శరీరానుసారమైన క్రియల వలన వచ్చినది కాదు. అయినను మనకొరకు అనేక శ్రమలను పొందెను. ఇదియే బలి యర్పణ.  ఇట్టి బలియర్పణను. ప్రేమను బోధించుటకు ఆయన తనను సాదృశ్యముగా యెంచుకొనెను. మనలనూ అట్లే ప్రేమ, త్యాగము, సాత్వికము, సహనములను అలవరచుకొనుమని తెలుపుచూ, ఆయన యొక్క ప్రతి విషయమందును, సాధనచే ఐక్యత పరచుకొనుమని బోధించెను. అనగా ప్రేమతో, త్యాగ బుద్ధితో ఆయన వలెఉండుటకు సాధన చేయ  వలెను. ఆయనను ప్రతి అంశములోను సహృదయముతో వెంబడించ వలెను. యేసు యీలాగున చెప్పెను ''నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించు వాడు చీకటిలో (అజ్ఞానములో) నడువక, జీవపు వెలుగు(స్వరూప జ్ఞానము) కలిగి ఉండును. నేను ఎక్కడ నుండి వచ్చితినో (పరలోకము నుండి వచ్చెను) , ఎక్కడికి వెళ్ళుదునో (మరల పరలోకమునకే వెళ్ళుదును) నేనెరుగుదును. మీరు ఎరుగరు, నన్ను ఎరిగి యుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి యుందురు'' (యోహాను 8:12,14,19). ఈ విధముగా ఎరిగినచో అది సత్యము. సత్యమనగా మీరే దైవము అని ఎరుగుట. అది తెలియని  వాడు అజ్ఞాని. యేసు బోధ యీలాగు ఉండెను. ''నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచి యుందును ..... ఎవడు నాయందు నిలిచి యుండునో నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును.'' (యోహాను 15:4,5). మీరు దైవములు... లేఖనము నిరర్థకము కానేరదు కదా! దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు...నేను తండ్రి క్రియలు .... చేసిన యెడల .... తండ్రి నా యందును, నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడి'' (యోహాను 10:34-38). ఈ సత్యమును ఎరుగుటయే జ్ఞానము. జ్ఞానవంతులైన వారు దైవము కంటె వేరు కాదు. ఈ అనుభవమును పొందక మునుపు అజ్ఞానము వలన నీవు వేరు దేవుడు వేరు అను కొనుచుండిరి. ఇప్పుడు విశ్వాసము వలనను, సాధన వలనను నీవు దేవుని కంటె వేరు కాదను జ్ఞానమును పొంద వలెను. ముందుగా దేవుని గురించియు, సత్యమును గురించియు తెలిసికొని హృదయ పూర్వకముగా విశ్వాసము నొందవలెను. ఎందుకనగా ''మనము ఆయన యందు బ్రతుకు చున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగి ఉన్నాము'' (అపొ||కా.17:28). ఆయన ఆజ్ఞలేనిదే చీమయైనను కదలదు.

    తండ్రియైన యెహోవాయే అద్వితీయుడైన సత్య దేవుడు. ''అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'' (యోహాను 17:3). నిత్య జీవమై ఉండుటయే జ్ఞానము. ''యేసు క్రీస్తు నిన్నను , నేడును ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును'' (హెబ్రి 13:8). ఆయన శాశ్వతుడు, నిత్యుడు, మార్పులేని వాడు ఆదియును, అంతమును లేని వాడు.  ''సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును''(యోహాను 16:13). అనగా జ్ఞానములో మనము ఆయనతో సత్య స్వరూపముగా, ఒక్కటిగా ఉందుము.  ''దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింప వలెను తనను ఆరాధించు వారు అట్టి వారే కావలెను'' (యోహాను 4:23,24). ఇట్టి ఆరాధన వలన  దేవుని కృపచేే, నీకంటె వేరు అని భావించుచున్న  దైవమును నీతో ఐక్యత పరచుకొందువు. యేసు ఇట్లు చెప్పు చున్నాడు. ''మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా మీరు నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను సర్వ స్వతంత్రులుగా చేయునని చెప్పెను'' (యోహాను 8:31). దేవుని ఎరుగువాడు దేవుడే, సత్యమును గ్రహించినవాడు సత్యమే అగు చున్నాడు. దేవుని వాక్యము దేవుడే అయి ఉన్నది. యేసు ప్రభువు పలుకు ప్రతి వాక్యము తండ్రి చేతనే పలికించ బడినది. కనుక వాక్యము సత్యమును తెలుపును. సత్యత్వానుభవము ఉన్న అపొస్తలుల వలన, శిష్యులును సత్యమును గ్రహించెదరు. అట్టి శిష్యులు ఆత్మ శుద్ధిచే పాపము నుండి విమోచనము నొంది, ఆత్మగా స్వతంత్రులగుదురు.

    ''ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సత్యస్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయనయందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను , ఆయనను బట్టియు సృజింప బడెను. ఆయన అన్నింటి కంటె ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధార భూతుడు'' (కొలస్సి 1:15-17).  ''నేనును తండ్రియు ఏకమై యున్నామని వారితో చెప్పెను.''

(యోహాను 10:30).శరీరముగా నున్నప్పటికిని ఆయన తండ్రి యొక్క అంశ కలిగి యుండుట వలన, ఆ తండ్రి వలననే సత్యస్వరూపియై ఉన్నాడు. సర్వసృష్టి కంటెను ముందుగానే  నున్నవాడును, సనాతన పురుషుడును అయి ఉన్నాడు. ఆకాశమునుండి భూమి వరకు సృఙష్టింప బడక ముందు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఉండెను. వాటికంటె ముందు జీవ శక్తియు, అంత కంటెముందు విశ్వ శక్తియు ఉండెను. వీటన్నింటి వలన జగత్తు , జీవులు ఉద్భవించెను. ఆయన మాత్రము వీటన్నింటి కంటె ముందుగానే ఉండి, సర్వ సృష్టికిని ఆధార భూతుడుగ నుండెను. ఆయన వలన జీవులు అనేక వ్యాపారములు జరుప శక్యమాయెను. వారి వారి వ్యాపారములను వారి ఇంద్రియములు జరుపు చుండగా, ఆ ఇంద్రియములు వెలుగే దేవుడైన వాని వలన  ఏర్పడిన దేవ దూతల ద్వారా ప్రేరణ పొందుచున్నవి.

    మనస్సు, బుద్ధి, చిత్తము , అహంకారము అను అంత:కరణమును(4), సమాన  వాయువు ,ఉదాన వాయువు, వ్యాన వాయువు, ప్రాణ వాయువు,      అపాన వాయువు అను పంచ ప్రాణములును (5), చెవులతో వినుట , చర్మముతో స్సర్శ తెలిసికొనుట,  కళ్ళతో చూచుట, నాలుకతో రుచి చూచుట, ముక్కుతో వాసన చూచుట అను పంచ జ్ఞానేంద్రియములును (5), మాట్లాడు నోరును, పని చేయు చేతులు, కాళ్ళు, ఆనదించు గుహ్యము, మల విసర్జన చేయు పాయువు అను పంచ కర్మేంద్రియములును(5) కలిసి ఈ 19 ఇంద్రియములతో మనుష్యుడు క్రియలు జరుపుచు, గ్రహించుచు, అనుభవించుచు నుండును. ఈ 19 తత్వములతో కూడిన దేహము సూక్ష్మ శరీరము అనబడును..

    శరీరానుసారమైన మనుష్యుడు తన ఇంద్రియములే స్వతంత్రముగా పని చేయుచున్నవని తలంచును. సాధకుడైన వాడు విచారణచే తాను జరుపు క్రియలు దేవ దూతల ప్రేరణచే జరుగు చున్నవని తెలిసికొనును. అందుచేత అతడు దేవుని మూలముగా, ఆ దేవ దూతలే జరుపు క్రియలు  తనవి గావను జ్ఞానము పొందును. అట్లు జీవించుట ఆత్మాను సారమైనది. ''సకల యుగములకు రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు దేవుడు, అట్టి దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును'' (1తిమోతి 1:17). సృష్టి ఆవిర్భవించక మునుపు దైవము మాత్రమే ఉండెను.  అందువలన సృష్టిలో నుండు వారికందరికి ఆయన యుగయుగములకును, సర్వసృష్టికిని రాజాధిరాజుగా తలంచ వలెను. అక్షయుడనగా క్షీణఙించని వాడు మరియు నశించని వాడు. అదృశ్యుడనగా దృశ్యము కాని వాడు మరియు మనస్సుకును జ్ఞానేంద్రియములకును తెలియ బడని వాడు. త్రికాలములు లేని వాడు. అందు వలన అట్టి కాలములకు అతీతుడై,ఆ ఆయా కాలములను తన స్వాధీనమందుంచు కొనిన వాడగును.  మెలకువ సమయము, స్వప్న సమయము, గాఢ నిద్ర సమయము, ఈ మూడు సమయములు మనుష్యులందరికి సామాన్యము. కాని ఆత్మ అన్ని సమయములలో నుండి , ఆయా సమయముల కంటె వేరుగాను, సాక్షిగాను ఉండును. ఆత్మయనగా దేవుడే !

    ''కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమునందుంచు కొనియున్నాడు '' (అపొ||కా.1-7). ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్న అక్షరములన్నియు ఆయనే అయి ఉన్నాడు కనుక అక్షరుడుగా నున్నాడు. అక్షరుడనగా క్షరముగాని వాడు. ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్న అక్షరములన్నియు చేరి వివిధ పదములుగా యేర్పడి మార్పు చెందు అర్ధములు కలిగి ఉన్నవి. అటులనే క్రియలందును , సుఖ దు:ఖములందును అనుభవ భేదము కనబడుచున్నది. కాని దేవుని వాక్యము ఎట్టి మార్పులు లేక, ఒక్కటైన సత్యము ను, జ్ఞానమును, ఆనందమును అయి ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ''ఆల్ఫాయు ఓమెగయు నేనే (సర్వము నేనే) వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండు వాడను నేనే'' ప్రకటన 1:8  ( సర్వ కాలములలో మార్పు చెందని సత్యము నేనే). ''మొదటి వాడను , కడపటి వాడను, ఆదియు అంతమునై యున్నాననెను'' (ప్రకటన 1:18). మొదటివాడు అనగా దేవుని వాక్యమును అతిక్రమించక వున్న ఆదాము. కడపటి వాడనగా క్రీస్తుయేసు నందు ప్రవేశించి పరిశుద్ధాత్మగా మారినవాడు. మొదటి వాడైనను, కడపటి వాడైనను, మధ్యస్థితులలో నున్న అన్యజనులు మొదలు క్రీస్తు వరకు ఎవరైనను ఆత్మగా చూచిన యెడల ఒక్కడే గాని పాపపు శరీరములుగా చూచినచో అనేకము. ఒక్కడే అయినది సత్యము. కనుక ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్నవాడు అక్షరుడైన దేవుడే. ''దేవుడొక్కడే తప్ప మరిఎవడును సత్‌ పురుషుడు కాదు'' (లూకా 18:19). 

    సత్‌ పురుషుడు అనగా శాశ్వతముగా ఉన్నవాడు, పుట్టుక, చావు లేని వాడు, ఉత్పత్తి నాశనములు లేని వాడు, ఆది అంతములు లేని వాడు, మార్పు చెందని వాడు, పరిణామము లేని వాడు. దీనికి వ్యతిరేకమైన అసత్‌ కాని వాడు. దేవుడు తప్ప ఏదయినా ఉన్న యెడల అవి అన్నియు చావు పుట్టుకలు, మార్పు చెందు గుణములు కలవి మరియు అశాశ్వతమైనవి. సర్వములో సర్వావస్థలలో ఒక్క తీరుగా నున్నది సత్‌ అన బడును. అందు వలన దేవుడు సత్‌ పురుషుడు.

    ''ఆయన (యేసు క్రీస్తు) దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొన లేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను'' (ఫిలిప్పి 2:6). యేసు క్రీస్తు దైవమే తానుగా ఉండుట వలన, తాను మనుష్యుని పోలిక నున్నప్పటికిని, తాను దైవము కంటె  వేరని భావించ లేదు. అందు వలన యేసుకు తండ్రి వలె నుండుట క్రొత్తగా సంభవించగల ఉన్నత పదవి కానే కాదు. కనుక అది తన భాగ్యముగా యెంచనే యెంచడు. శరీర ధారిగా రిక్తుడు, అనగా  శరీరానుసారమైన యే  సంకల్పమును కర్తవ్యమును లేనివాడు. అయినప్పటికిని  తండ్రి సంకల్పించిన పనులకు తాను దాసుడై యుండెను శారీరక క్రియలను తండ్రి కార్యములుగా చేయు చుండెను. అందువలన ఆయన తండ్రికి ప్రతినిధియు, తండ్రిని చేరుటకు మార్గమును ఆయ్యెను. ఈ విధముగా ఆత్మాను సారులకు సాదృశ్యమయ్యెను.

    ''ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాప విషయములో శుద్ధీకరణ తానే చేసి... ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని  కుడి పార్శ్వమున కూర్చుండెను ''(హెబ్రి 1:2-4).

    యెహోవా ప్రపంచములను నిర్మించలేదు గాని, ఆయన లేకుండా ఏదియు సృజించ బడలేదు. ఆయన సత్తావలన యేసుచే అన్నియు నిర్మించ బడెను. ఇందుకు మహత్తు అను తేజస్సు , దేవుని సత్తా యొక్క క్రియా రూపమై సమస్తమును నిర్వహించ బడుచున్నది. కనుక క్రీస్తు స్థితిలో అందరును గుర్తించునట్లుగా నుండి యేసు స్థితిలో తండ్రి వలె జ్ఞానమై ఉండెను. తండ్రి చేయు క్రియలకు రూపునిచ్చునది దైవకుమారుడే. అందు వలన దైవకుమారుడు జ్ఞానమునందును, స్వరూపమునందును సత్యమై, సత్తాయై మరియు అధికారియై సమస్తమును సృష్టించుచు, పోషించుచు, లయము చేయుచు, తన ద్వారానే తండ్రి సంకల్పములను నెరవేరు నట్లు చేయును. ఈ యేసు క్రీస్తు స్థితి అజ్ఞానులకు క్రీస్తుగా కనబడుటకును, జ్ఞానులలో యేసుగా ప్రతిష్ఠితుడై  ఆ జ్ఞానమును అందరికి అందించ గలుగుటకును ఉపయోగ పడును. ఎందుకనగా జ్ఞానమైన తండ్రి కన పడడ్ష్ము అజ్ఞానియైన వాడెవడైనను మన అజ్ఞానమును తొలగించ సామర్ధ్యము లేని వాడగును. అందు వలన యేసుక్రీస్తు ఒక్కడే ఈ రెండు స్థితుల కలయికతో ఉన్నందు వలన మనకు జ్ఞానోదయము కలిగించగలవాడు మరియు సద్గురువుతో సమానము. అందుకే యీ దైవకుమారుడు రక్షకుడు, ఆదరణకర్త, పోషకుడు, యజమాని, స్నేహితుడు, ప్రేమ గల సహోదరుడు, జ్ఞాన నేత్రమును తెరిపించువాడు, మారుమనస్సును అనుగ్రహించు వాడు, ఎట్టి పాపులనైనను వారి పశ్చాత్తాప మూలమున క్షమించి, రక్షించు ప్రియతముడును, కరుణామయుడును. ఇట్టి వానిని మనకు అనుగ్రహించుటలో తండ్రికి మన యెడల సహజమైన ప్రేమ ఉన్నది. అందు వలననే ఎవడైనను యేసు క్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు అని వాక్యము.  యేసు క్రీస్తు  గురు స్వరూపమై అంత:కరణములను   శుద్ధీకరణ చేయుట ద్వారా జ్ఞానమును నొసంగుచున్నాడు. ఆయన (యేసు) యందు దైవత్వము స్వరూపముగా నున్నది, అయినను, ఆయన మూర్తిమంతమై  (క్రీస్తుగా) శిష్యుల శుద్ధి కొరకు వచ్చెను.

    ఈ విధముగా తండ్రి లోను కుమారునిలోను క్రీస్తుగా మారినట్టి తనలోని దేవుని మహిమను, ఘనతను దర్శించ వలెను. అనగా క్రీస్తైన సాధకుడును, కుమారుడైనట్టి యేసును, తండ్రియైనట్టి యెహోవాను ఒక్కటేయని అనుభవము కలుగ వలెను. ఈ ముగ్గురిలో నున్న పరిశుద్ధాత్మ ఒక్కడిగా నుండి యీ మూడు స్థితులను పోషించుట ద్వారా దీనిని త్రిత్వమందురు. ఇదియే పరిపూర్ణమైన జ్ఞానము. ''మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా నుండెదరు'' (మత్తయి 5:48). కుమారుని ద్వారానే పరిపూర్ణ జ్ఞానము కలుగును కనుక ఆ కుమారుడే సత్యమైయుండి మార్గముకూడా అయ్యెను. పరిపూర్ణమైనది జ్ఞానము. పరిపూర్ణము కానిది అజ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము ఉండజాలదు. ఎట్లనిన వెలుగు ఉన్నచోట చీకటి ఉండనేరదు. ''పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును'' (1కొరింథి 13:10). యేసు వాక్యము సత్యవాక్యమే అగును. ఆయనచే  నియమించ బడిన అపొస్తలుల వాక్యముకూడా సత్యవాక్యమే. ఎందుకనగా అపొస్తలులు  క్రీస్తు యేసు స్థితియందుండి యేసు  ప్రేరణచే ప్రవచింతురు గాని, వారికై వారు భాషించరు.

    కనుక ''మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముంద్రింప బడితిరి. దేవుని మహిమకు కీర్తికలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్త్యమునకు సంచకరువుగా ఉన్నాడు'' (ఎఫెసి 1:13-14). ఆయన సంపాదించుకొనిన ప్రజలనగా క్రీస్తుయేసుగా ఉన్న ఆయనచే  సంపాదించు కొనబడిన వారు, అనగా క్రీస్తుగా మారిన విశ్వాసులు. ఆ విశ్వాసులు క్రీస్తుయేసు నందు ప్రవేశించి ఆయన ప్రజలైరి. ఆయనలో చేర్చుకొన బడినవారు శారీరక క్రియలు చేయుచున్నను, క్రీస్తు నందుండుట వలన వారు ఆ క్రియలను చేసియు చేయని వారగుచున్నారు. ఎందుకనగా వారి అంత:కరణములు విశాల పరచబడినవి. వారి హృదయములు పరిశుద్ధ పరచబడినవి. అందు వలన వారి యొక్క శ్రమలు మరియు వేదనలనుండి విముక్తులగుచున్నారు.. ఇదియే వారికి లభించిన స్వాస్త్యము.  దేవుని మూలమైన విశ్వాసముతో క్రీస్తుగా మారిన వారు ఆయన యందు చేరి ప్రతిష్ఠితులగుదురు. అప్పుడు వారనుభవించు ఆనందమే వారికి స్వాస్త్యము.  ఎందుకనగా వారి జ్ఞాన  నేత్రములు వెలిగించ బడును. ఆయన యొక్క మహిమైశ్వర్యములను పొందుదురు. క్రీస్తు శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యము ఎట్టిదో మీ హృదయ పూర్వకమైన విశ్వాసము మూలమున మీరు తెలిసికొన్నచో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన, మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసి కొనుట యందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయును అనుగ్రహించును. ఈ అనుగ్రహమే సంచ కరువు. అజ్ఞానమువైపుగా ఉన్న జీవము తండ్రి మహిమ వలన ఉజ్జీవమై జ్ఞానము కలిగినందున నిత్యజీవముగా  మారును. ఇదియే సంచకరువు. ఆత్మాను సారుల హృదయ పూర్వక విశ్వాసము వారిని క్రీస్తుగా మార్చును. క్రీస్తైన వారు క్రీస్తుయేసు నందు ఉండెదరు. అక్కడ వారు వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మచే(యేసుక్రీస్తుచే) ముద్రింపబడుదురు. ముద్రింప బడిన వారు  జ్ఞానముతో స్వస్థత నొందుదురు. స్వాస్త్యమైన వారికి ఆయన సంచకరువై ఉన్నాడు. ఆ సంచకరువు మూలముగా క్రీస్తుయేసు అయిన వాని ఆత్మ దేవుని ఆత్మచేత పరిశుద్ధ పరచ బడి పరిశుద్ధాత్మగా అనగా యేసుగా మారును. పరిశుద్ధాత్మగా అభిషిక్తులైన వారికి పరలోక నివాసము (యెహోవా నందు) శాశ్వత నివాసముండును. ఇదియే సత్యమును వెంబడించి సత్యముగా మారుట. ఈ పరలోక రాజ్య నివాసమందు క్రీస్తు న్యాయస్థానము ఉండదు కనుక యిక మరణమునకు తీర్పు తీర్చ బడదు. ఇదియే నిత్యజీవము.